పరిగి : పరిగి కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. వివరాల్లోకి వెళ్తే శనివారం పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పక్కనే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్రెడ్డి వర్గం, పూడూరు మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు దీక్షకు ఉపక్రమించారు. ఇదేమిటని పరిగి నాయకులు ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగాయి. ఒకదశలో ఘర్షణకు దిగడంతో పాటు నెట్టుకున్నారు.
అక్కడే ఉన్న పోలీసులు సముదాయించినా వినకపోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. ఇదిలావుండగా ఈ దీక్షకు డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి హాజరుకాకపోవడం గమనార్హం. ఇదిలావుండగా కొంతకాలంగా పరిగి కాంగ్రెస్లో రెండు వర్గాలు కొనసాగుతున్నాయి. యూత్ కాంగ్రెస్ ఎన్నికలప్పటి నుంచి రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచిన సతీష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాంమోహన్రెడ్డిలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోసారి బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి.