మహబూబ్నగర్ మెట్టుగడ్డ/నారాయణపేట, ఆగస్టు 27: పెండింగ్ కేసుల పరిష్కారం కోసమే లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు తెలిపారు. శనివారం నారాయణపేటలో నైపుణ్య శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా లీగల్ అవేర్నెస్ క్యాంపులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందించడమే న్యాయ సేవా సదనం ముఖ్య ఉద్దేశమన్నారు.
అసంఘటిత కార్మికులకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో 1,400 క్యాంపులు ఏర్పాటుచేశామని తెలిపారు. అనంతరం మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అడ్మిస్ట్రేషన్ జడ్జీ లక్ష్మణ్ మాట్లాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద, నారాయణపేట జిల్లా తిప్రాస్పల్లి శివారులో జిల్లా కోర్టుల భవన నిర్మాణానికి స్థలాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ లక్ష్మణ్, నారాయణపేట కలెక్టర్ హరిచందన తదితరులు పరిశీలించారు.