Kandhar loha | | (లోహా నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి) | లోహా.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే విశిష్టత ఉన్నది. పోరాటాల చరిత్రను కలిగి ఉన్నది. అంతకు మించి చారిత్రక నేపథ్యమున్నది. బహుజన పోరాటాల వారసత్వం ఉన్నది. రైతు ఉద్యమాలతో రాటుదేలింది. రైతు ఉద్యమ నేతల వెంటే నిలబడింది. వారి బాటలోనే నడిచింది. దశాబ్దాలుగా వంచనకు గురైంది. ఆశలు ఆవిరైపోతున్న వేళ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారికి ఆశాకిరణమయ్యారు. రైతుల పక్షపాతి, అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన నాయకుడే తమ ప్రాంతానికి వస్తుండటంతో లోహా మురిసిపోతున్నది. కేసీఆర్ నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ను ఎత్తుకున్నది.
మహారాష్ట్రలో అతి పురాతన, మార్కిస్ట్ రాజకీయ పార్టీ.. పెజెంట్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (పీడబ్ల్యూపీఐ). 1948లో కేశవరావు జేఢే నేతృత్వంలో ఇది ఆవిర్భవించింది. రైతులు, రైతుకూలీల హక్కుల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నది. పర్భణి, నాందేడ్, రాయ్గడ్ జిల్లాల్లో నేటికీ బలంగా ఉన్నది. ముఖ్యంగా కంధార్, లోహా మొదటి నుంచి పీడబ్ల్యూపీ వెంటే నిలబడుతుండటం విశేషం. కంధార్ నియోజకవర్గం 1972లో ఏర్పాటయింది. పీడబ్ల్యూపీకి చెందిన దోండ్గే కే శంకర్రావు తొలి ఎమ్మెల్యేగా గెలిశారు. 2004 వరకు 8 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించగా, నాలుగుసార్లు పీడబ్ల్యూపీ అభ్యర్థులే గెలవటం విశేషం. 2008 నియోజకవర్గ పునర్విభజనలో కంధార్ రెండు నియోజకవర్గాలుగా ఏర్పడింది. అందులో ఒకటి ముద్ఖేడ్ కాగా రెండోది ప్రస్తుత లోహా. లోహా నియోజకవర్గ మొదటి ఎన్నికలో ఎన్సీపీ తరఫున శంకరన్న దోండ్గే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొదటి నుంచీ రైతు, రైతుకూలీల పోరాటాలతో నిర్వహించిన నాయకుడే. ఇక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్యాంసుందర్రావు దడ్గోజీ షిండే కూడా పీడబ్ల్యూపీ తరఫునే ఎన్నికవడం విశేషం.
లోహా నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.94 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులోనూ గ్రామీణ జనాభా 86 శాతం. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు 20 శాతానికి పైమాటే. సాగునీటి వసతులు లేని లోహా పూర్తిగా కరువుపీడిత ప్రాంతం. తెలంగాణకు సమీపంలో ఉండటంతోపాటు ఇక్కడి గ్రామాల నుంచి కార్మికులు బాసర, బోధన్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో సంక్షేమ పథకాల తీరు, సాధిస్తున్న ప్రగతి లోహా వరకు పాకింది. ఇప్పుడు కేసీఆరే కిసాన్ సర్కార్ నినాదంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంతో లోహా రైతులు మురిసిపోతున్నారు. బీఆర్ఎస్తో మమేకం అవుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే ఎన్సీపీతోపాటు చిన్న పార్టీలన్నీ ఖాళీ అయ్యాయంటే బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి నేను విన్నాను. నాకు 20 ఎకరాల భూమి ఉంది. రెండెకరాలకే బోరు ద్వారా నీటి వసతి ఉన్నది. కరెంటు కూడా సక్రమంగా లేక పంటలకు సరిగ్గా నీరందటం లేదు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తే మద్దతు ధర కూడా లభించదు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ మాలాంటి పేద రైతు వర్గాల్లో ఎంతో ఆశను పెంచింది. చాలామంది రైతులు ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేద్దామని అంటున్నారు.
-దిగంబర్ శేష్రావు షిండే, హల్దౌ గ్రామ రైతు
నాందేడ్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. ఈ ప్రాంతం నుంచి గోదావరి, పెన్గంగా నదులు ప్రవహిస్తున్నా రైతులకు సాగునీటి వసతి లేదు. జిల్లాలో విష్ణుపురి, బాబ్లీ తప్ప మరో ప్రాజెక్టే లేదు. భూగర్భ జలాలున్నా, బోరు వేయించుకొని వ్యవసాయం చేద్దామన్నా.. తెలంగాణ లాగ వ్యవసాయనికి ఉచిత కరెంటు లేదు. అందుకే మేం పత్తి, జొన్న, మక్క లాంటి వర్షాధార పంటలు పండిస్తాం.
– రామ్రావు పాంచాల్, బేరడీ గ్రామ రైతు