హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి, జనవరి 8: సకల కులవృత్తుల సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య వేదికలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక శనివారం ఆయన రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సాహిత్య అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. ప్రజలు పుస్తకాలను సంప్రదాయ విధానంతోపాటు డిజిటల్ వేదికపై చదివే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. పద్య, గద్య, వచన, కథ, నవల తదితర అన్ని సాహిత్య ప్రక్రియలకు, అన్ని వాదాలకు సంబంధించిన సాహిత్యాన్ని సమగ్రమైన సంకలనాలుగా ప్రజల ముందుకు తీసుకువస్తామని పేర్కొన్నారు. సకల వృత్తులకు సంబంధించిన సాహిత్యం, కథలు, కవిత్వాలను సీరిస్లుగా ముద్రిస్తామని చెప్పారు.
తెలంగాణ సంస్కృతి, సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీల మాదిరిగా తెలంగాణ నిఘంటువులను సీరిస్లుగా వెలువరిస్తామని వెల్లడించారు. సాహిత్యాన్ని అభిమానించే, ప్రేమించే వారి కోసం వాటిని పుస్తకరూపంలో, డిజిటల్ రూపంలో, యూట్యూబ్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం తెలుగు యూనివర్సిటీ, తెలుగు అకాడమీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యార్థులకు తెలుగు భాషపై అవగాహన కల్పించడంతో పాటు వారు మన యాస, భాషపై పట్టుసాధించేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.