హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెరిగిన మద్యం ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. బీర్లతోపాటు వివిధ రకాల మద్యంపై ఎంత మేర పెరుగుదల ఉంటుందన్న దానిపై స్పష్టత రాలేదు. ధరల పెంపు ఖాయమైన నేపథ్యంలో బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వైన్స్, బార్, రెస్టారెంట్లను ఆబ్కారీశాఖ అధికారులు సీజ్చేశారు. ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ వివరాలు సేకరించారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి తెచ్చుకున్న స్టాక్కు కొత్త ధరలు అమలుచేయడంలో భాగంగా వివరాలు తీసుకొన్నట్టు తెలిసింది. నూతన ధరల ప్రకారం ఆ స్టాక్కు అనుగుణంగా దుకాణదారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.