ములుగు, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్ మిల్లు వద్ద నూతన వైన్స్ షాపు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వైన్స్ పెట్టవద్దని స్థానికులు సూచిస్తూ వస్తున్నారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి డీసీఎంలో మద్యం లోడ్ వచ్చింది.
అక్కడి చేరుకున్న స్థానికులు ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల తమకు ఇబ్బందులు ఏర్పడతాయని అభ్యంతరం చెప్పారు. దీంతో షాపు యజమాని కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేసేందుకు డీసీఎంలో ఉన్న బీర్ల పెట్టెలను జాతీయ రహదారిపై పగులగొట్టి వీరంగం సృష్టించాడు. ఎక్సైజ్ సీఐని వివరణ కోరగా కాలనీవాసుల ఫిర్యాదు మేరకు షాపు అక్కడ వద్దని చెబితే యజమాని వినడం లేదని తెలిపారు.