హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య నాలుగు లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్ల ప్రక్రియకు జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సన్నాహాలు చేస్తున్నది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు ఆమోదం తెలపడంతో రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభించింది. సుమారు 143 కిలోమీటర్ల పొడవున భూసేకరణ చేయాల్సి ఉన్నది. జాతీయ రహదారి-63లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం రూ.3000 కోట్లు మంజూరు చేసింది. ఈ రహదారి నిర్మాణం కోసం భారీగా భూసేకరణ చేపట్టాల్సి రావడం, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో గత కేసీఆర్ ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరించింది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఎన్హెచ్ఏఐకి హామీ ఇచ్చింది. వారు టెండర్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల, క్యాతన్పల్లి, వేంపల్లి శివార్ల నుంచి రంగంపేట, ఆర్ఆర్ నగర్, అమ్మ గార్డెన్స్, ఎంఎన్ఆర్ గార్డెన్స్ ఏరియా, గద్దెరాగడి తదితర ప్రాంతాలమీదుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట తదితర పట్టణాలు కూడా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణలో భారీగా ఇండ్లకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున పట్టణాల వెంబడి పొలాల నుంచి బైపాస్ను నిర్మించాలని నిశ్చయించారు. జగిత్యాలలో అత్యధికంగా 70 కిలోమీటర్ల మేర, మంచిర్యాల జిల్లాలో దాదాపు 40 కిలోమీటర్లు, నిజామాబాద్లో 30 కిలోమీటర్ల వరకు రహదారిని విస్తరించాల్సి ఉన్నది. ఇప్పటికే కోరుట్ల, మెట్పల్లి ప్రాంతంలో వరద కాలువ, రైల్వేలైను కోసం రైతులు భూములను కోల్పోగా, తాజాగా నాలుగు లేన్ల రహదారి కోసం కూడా భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.