హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగా ణ): దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు మరింత మెరుగుపడాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. గురువారం ఢిల్లీలో నీతి ఆయోగ్(ఎడ్యుకేషనల్ వర్టికల్), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ)లు సంయుక్తంగా ‘యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఇందులో ఐదు రాష్ర్టాల ఉన్నత విద్యామండలి చైర్మన్లు, 60 యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు. ‘క్వాలిటీ, ఫైనాన్సింగ్, గవర్నెన్స్ అండ్ ఎంప్లాయిబిలిటీ ’ అనే అంశాలపై కీలకంగా చర్చించారు. ఉన్నత విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, అందుకే యూనివర్సిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని లింబాద్రి చెప్పారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వీ వెంకట రమణ హాజరయ్యారు.