హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): జూలై 3వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని తెలిపింది.
మరోవైపు దేశమంతటా విస్తరించిన నైరుతి రుతుపనాల షీర్ జోన్ బుధవారం బలహీన పడినట్లు పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంతో వర్షం తీవ్రత తగ్గి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా గడిచిన 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. మహబూబ్నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.