హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నేటి యువతకు స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కొనియాడారు. మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. భూమికోసం, భుక్తి కోసం, దోపిడీ, పీడనల విముక్తి కోసం జరిగిన ఆనాటి పోరాటంలో ఆమె వీరోచితంగా పోరాడిందని వినోద్కుమార్ తెలిపారు. ఆనాటి దొరల గడీలను ఐలమ్మ గడగడలాడించిందని గుర్తు చేశారు. ఆమె చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.