సుద్దాల హనుమంతుకు నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తన జీవితమంతా కష్టజీవులు, ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి సుద్దాల హనుమంతు అని పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన మహనీయుల ఆశయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జాతి యావత్తును తన కవితలతో మేల్కొలిపిన మహాకవి సుద్దాల హనుమంతు అని చెప్పారు. ఆయన కవితల్లో ఆవేశం, అర్థాల్లో ఆలోచన ఉంటుందని, భావాల్లో సామాజిక స్పృహ ఉంటుందని అభివర్ణించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో బతికి ఉన్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి, పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవిగా గుర్తింపు పొందారని చెప్పా రు. విచిత్ర వేషాలు, గొల్లసుద్దులు, లత్కోరుసాబ్, బుడబుక్కలు, ఫకీరువేషం, సాధువు మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధలు, భావాలను వ్యక్తీకరించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా హనుమంతు రాసిన పాటలను ఆయన కుమారుడు సుద్దాల అశోక్తేజ పాడి వినిపించారు. అనంతరం సుద్దాల అశోక్తేజను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.