హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగా ణ): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతల తీరు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణలో బియ్యం సేకరణకు గోదాముల సమస్య లేనే లేదన్నారు. గోదాముల్లో స్థలం సమస్య ఉన్నదని, ఎక్కువ స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్రం నుంచి ఒక్క లేఖ కూడా తమకు రాలేదని బుకాయించారు. రాష్ట్రం నుంచి ఎప్పుడు ఏ లేఖ ఎందుకోసం వచ్చిందో కూడా తెలుసుకోకుండానే గోయల్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారా? లేక తెలియనట్టు నటిస్తున్నారో అర్థం కాదు. ‘రాష్ట్రంలో ఎఫ్సీఐ గోదాముల్లో స్థలం కొరత భారీగా ఉంది. దీంతో మేం సరఫరాచేసిన బియ్యం ఎఫ్సీఐ తీసుకోవడం లేదు. స్టోరేజీ కెపాసిటీ మరింత పెంచి సమస్యను పరిష్కరించండి’ అంటూ తెలంగాణ పౌరసరఫరాల శాఖ.. రీజియన్ ఎఫ్సీఐ జీఎంకు పదే పదే లేఖలు రాసింది. ఈ ఏడాదిలోనే ఏడు లేఖలు రాసింది. కానీ ఒక్క లేఖకు కూడా ఎఫ్సీఐ నుంచి జవాబు రాలేదు. అటు ఎఫ్సీఐ, ఇటు కేంద్రం కావాలనే స్టోరేజీ కెపాసిటీ పెంచకుండా తెలంగాణను ఇబ్బంది పెట్టారనేది స్పష్టమవుతున్నది. ఏఏ జిల్లాల్లో ఎంత స్టోరేజీ కేటాయించారు? ఎంత బియ్యం ఇవ్వాల్సిఉన్నది? ఇంకెంత స్టోరేజీ అవసరం? అనే వివరాలను పేర్కొంటూ రాష్ట్రం లేఖ రాసింది. ఎఫ్సీఐ తెలంగాణ రీజియన్ జీఎంకు గతేడాది నవంబర్ 11, ఈ ఏడాది జూన్ 18, 30, అక్టోబర్ 11, 26, నవంబర్ 12, డిసెంబర్ 10న లేఖలు రాసింది. ప్రతినెల 9 నుంచి 10 లక్షల టన్నుల బియ్యం సరఫరాచేసే మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ గోదాముల్లో స్థలం లేకపోవడంతో గత మూడు నెలలకు సరాసరిన 4 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నామని పౌరసరఫరాలశాఖ ఈ లేఖల్లో పేర్కొన్నది.