హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): గణపతి వేడుకల్లో మండపాలతోపాటు ఇండ్లల్లో మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సచివాలయంలో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
టీఎస్పీసీబీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రంగులు, రసాయనాల విగ్రహాలతో పర్యావరణానికి ముప్పేనని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పర్యావరణహిత గణపతులకే ప్రాధాన్యమిద్దామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.