మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నా, అసత్య ప్రచారాలు చేస్తున్నా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని.. ఇక మీదట ఊరుకొనే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడే భాష సరిగా లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అవి ప్రజలు హర్షించే విధంగా ఉండాలి కానీ అసహ్యించుకునేలా ఉండకూడదని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ ఈ పథకాలు అమలవుతున్నాయా అని ఆయన ప్రశ్నించారు. 14 సంవత్సరాల క్రితమే బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు అనే నినాదాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎత్తుకొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన ఉన్నదన్నారు. బయ్యారంలో 4 లక్షల టన్నుల ఐరన్ నిక్షేపాలు ఉన్నాయని, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి అనూకూలంగా ఉన్నదని వినోద్ సూచించారు. అటు కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా, ఎన్ఎండీసీ నిర్మిస్తామంటే అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.