హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాబోయే 18 నెలల్లో తెలంగాణలో పోషకాహారలోప గణాంకాలలో అద్భుతమైన మార్పును చూపిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 116 దేశాల్లో భారత్ 101 స్థానంలో ఉంది. పోషకాహార లోపంపై వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి.
కానీ మన దేశంలో అది జరగడం లేదంటూ గతంలో మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్పై బెంగళూరుకు చెందిన మోహన్దాస్ అనే వ్యక్తి ‘కేటీఆర్ తెలంగాణను మీరు 8 ఏండ్లుగా పాలిస్తున్నారు. ఇతరులను అనే ముందు దయచేసి మీ రాష్ట్రంలో పోషకాహార లోపంపై డాటాను విడుదల చేయండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ‘చాలెంజ్ను స్వీకరిస్తున్నా మోహన్.. రాబోయే 18 నెలల్లో మీరు మా రాష్ట్రంలోని పోషకాహార లోప గణాంకాలలో అద్భుతమైన మార్పు చూస్తారు.
నా ఈ ట్వీట్ను గుర్తు పెట్టుకోండి. మేం కర్ణాటకలోని 40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్లోని రేపిస్ట్ రిమిషన్ ప్రభుత్వాన్ని రెండింటినీ అధిగమిస్తాం. మంత్రి సత్యవతి రాథోడ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ వేగం పెంచాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.