హనుమకొండ, జూలై 3: కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాకతీయ వైభవ సప్తాహం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు గిరిజన సంక్షేమశాఖ తెలిపారు. ఈ నెల 7 నుంచి ప్రారం భం కానున్న కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ కలెక్టర్లతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓరుగల్లు అంటేనే కాకతీయ సామ్రాజ్యమని, కాకతీయ రాజులు ప్రజల కోసం చేసిన గొప్ప కార్యక్రమాలను తలుచుకోవడం మన బాధ్యత అన్నారు.
నిధులకు ఇబ్బందులు లేవని, ఇప్పటికే సాంస్కృతిక శాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. 700 ఏండ్ల తర్వాత కాకతీయ వంశస్థులు వారి జన్మభూమికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. కాకతీయుల చరిత్రను ఒక డాక్యుమెంటరీగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.