హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంట గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తి కొవిడ్ 19 కారణంగా నాలుగు రోజుల క్రితం మరణించాడు. కాగా మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదు .ఈ విషయం తెలుసుకున్న ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది మృతదేహాన్ని స్వయంగా అక్కడ నుండి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
దీనిపై రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. కరోనా సంక్రమరణ భయంతో బంధువులు తమ ప్రియమైన వ్యక్తికి తుది వీడ్కోలు పలికేందుకు సైతం దూరంగా ఉన్నారు. కాగా ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎటువంటి సంకోచం లేకుండా తమ సామాజిక బాధ్యతగా మృతదేహాన్ని దహన సంస్కారాలకు తరలించారు. ప్రియమైన పౌరులారా జాగ్రత్తలు తీసుకోండి కానీ ఓ వ్యక్తి చివరి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారెవరో తెలియని వ్యక్తులుగా ప్రవర్తించవద్దన్నారు. మానవత్వాన్ని ఎప్పుడూ నిరాకరించవద్దని డీజీపీ పేర్కొన్నారు.