నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ జనవరి 20: దేశంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై ఖమ్మం బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ ధర్మ యుద్ధాన్ని ప్రారంభించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో సెక్యులర్ శక్తులను ఏకం చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ బహిరంగ సభను నిర్వహించారని స్పష్టం చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ర్టాల హక్కులు, చట్టసభల తీర్మానాలను కాలరాస్తున్నదని విమర్శించారు.
ప్రొటోకాల్ పాటించలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర శాసనసభ, మండలి అమోదించిన బిల్లులను నాలుగు నెలలుగా తన వద్ద పెండింగ్లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గవర్నర్ వైఖరి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకునే ఉద్దేశంతో ఉన్నట్టు స్పష్టమవుతున్నదని దుయ్యబట్టారు. దేశంలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో.. కేంద్ర ప్రభుత్వం గవర్నర్లపై రాజకీయంగా ఒత్తిడి పెంచి స్థానిక ప్రభుత్వాలతో ఘర్షణాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నదని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవైపు ప్రధాని మోదీ మైనార్టీలను కలుపుకొని పోవాలని బీజేపీ శ్రేణులకు మార్గదర్శనం చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు నిజాం రాజు అంత్యక్రియలపై రాజకీయ విమర్శలు చేయడం మైనార్టీల పట్ల ఆ పార్టీ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని చెప్పారు. ఫిబ్రవరిలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయబోతున్నారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు.