రవీంద్రభారతి, మే18 : ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ’ అంటూ తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పాట గానకోకిల సుశీలమ్మ నోట పలికించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంతేకాదు.. తానూ గొంతు కలిపి కోరస్ సైతం అందించారు. ఈ అరుదైన దృశ్యానికి రవీంద్రభారతి బుధవారం వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో 70 ఏళ్ల సుశీలమ్మ పాట-ప్లాటినం జూబ్లీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు. ‘ఈ రోజు సుశీలమ్మను తెలంగాణ ఆడపడుచుల పాట.. బతుకమ్మ పాట పాడించడానికి వచ్చాను. అందుకు సుశీలమ్మ నాకు ఈ అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను.
ఎందుకంటే సుశీలమ్మ బతుకమ్మ పాట పాడితే తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో సంతోషిస్తారు’ అని ఎమ్మెల్సీ కవిత కోరారు. అందుకు అంగీకరించిన సుశీలమ్మ బతుకమ్మ పాట పాడగా ఆమెకు కోరస్గా కవిత కూడా పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, అమ్మలగన్న అమ్మ సుశీలమ్మ అని.. ఆమె గొంతు విననివారు ఉండరన్నారు. అలనాటి సుశీలమ్మ మధుర గీతాలైన లాలీలాలీ అనే పాట అంటే తనకెంతో ఇష్టమన్నారు. అలాంటి సుశీలమ్మ ప్లాటినం జూబ్లీ కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా సుశీలమ్మకు పౌర సన్మానం చేసి జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ గానకోకిల, మధుర గాయకురాలు సుశీలమ్మ పాటలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అనంతరం నవరస గాయని ఆమని బృందం సుశీల మధుర గీతాల కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్త, తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.