హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 16 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ (ఎల్ఏడీసీఎస్) కేంద్రాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి-కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జైళ్లల్లో ఉన్న విచారణ ఖైదీల్లో అత్యధికులు పేదలు, బలహీనవర్గాల వారేనని, అలాంటి వారికి న్యాయసేవా కేంద్రాలు అండగా ఉంటాయని చెప్పారు. 14 మంది చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్లను, 14 మంది డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్కౌన్సెళ్లను, 20 మంది అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెళ్లను ఆ కేంద్రాల్లో నియమించినట్టు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావు చెప్పారు.