హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే భవనాలు, రంగురంగుల బొమ్మలతో గోడలు, అత్యాధునిక వసతులతో క్లాస్ రూమ్లు, నాణ్యమైన విద్యాబోధన, పైగా ఇంగ్లిష్ మీడియం.. ఇవీ ఇప్పటి సర్కారు బడులు. దీంతో ప్రైవేట్ బాట పట్టిన విద్యార్థులంతా.. ఇప్పుడు సర్కారు బడి బాట పడుతున్నారు. బాడి బాట కార్యక్రమంలో భాగంగా తొలి వారంలోనే 19,111 చిన్నారులు ప్రైవేట్కు బై బై చెప్పి, సర్కారు స్కూళ్లలో చేరారు. వీరిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు పొందినవారున్నారు.
ఈ నెల 13 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్, ఈ నెల 30 వరకు బడిబాటను నిర్వహిస్తుండటంతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు తయారవటం, ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి వస్తుండటంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు వెనుకాడటం లేదు. ప్రైవేట్ ఫీజుల భారాన్ని మోయలేని ఎంతోమంది.. పైసా ఫీజు లేని, నాణ్యమైన విద్యను అందిస్తున్న సర్కారు బడులకు జై కొడుతున్నారు.
నా కూతురు ఇరిగి బృహతిని నల్లగొండలోని ఐఎంఎస్ ప్రైవేట్ స్కూల్లో 4వ తరగతి వరకు చదివించాం. ఇంగ్లిష్ మీడియం చదువుల కోసమే ప్రైవేట్ స్కూలుకు పంపిస్తున్నాం. ఇప్పుడు కతాల్గూడ ఎంపీపీఎస్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించారు. దీంతో ఆ బడిలోనే 5వతరగతిలో చేర్పించా. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్లమాధ్యమం అందుబాటులోకి తీసుకురావటం సంతోషం. ఫీజుల భారం తప్పుతుంది.
– ఇరిగి క్రాంతికుమార్, కతాల్గూడ, నల్లగొండ జిల్లా