హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 12వేల గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామకంఠం భూములను 30 ఏండ్ల పాటు ఐవోఆర్ఏ ఎకోలాజికల్ సొల్యూషన్ ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. పాలకమండళ్లు లేని సమయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలను తీసుకోవాలనడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. వేలాది కోట్ల ఆస్తులను ఒకే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్టు సందేహాలు వస్తున్నాయని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఒప్పందం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగంలోని 73వ సవరణ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని, తక్షణమే విరమించుకోవాలని జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, హరిత సౌభాగ్యం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలోని గ్రామకంఠం భూములను ఢిల్లీ కంపెనీకి కట్టబెడితే గ్రామ పంచాయతీలు తమ హకులు, రావాల్సిన ఆదాయం కోల్పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీని వల్ల భవిష్యత్తరాల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, పేదల పునరావాసం, తదితర ప్రజావసరాలకు భూములు లేకుండా పోతాయని పేర్కొన్నారు. భూముల విలువ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకొని, గ్రామ పంచాయతీలకే పూర్తి హకులు ఉండేలా చూడాలని, అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని జాన్వెస్లీ డిమాండ్ చేశారు.