హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం చంచల్గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డిని విచారించారు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం 12 గంటలకు జైలు లోపలికి వెళ్లిన నలుగురు ఈడీ అధికారులు సాయంత్రం 5 గంటలకు బయటికొచ్చారు. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుమిత్గోయెల్, దేవేందర్సింగ్ వేర్వేరుగా పేపర్ల అమ్మకం, కొనుగోళ్లు, జరిగిన లావాదేవీలపై సుదీర్ఘంగా విచారించినట్టు తెలిసింది. ఆర్థికలావాదేవీలు ఎలా జరిగాయి? పేపర్ ఎవరెవరి చేతులు మారింది? న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్రెడ్డి బావకు పేపర్ ఎలా వెళ్లింది? అతను ఎంత ముట్టజెప్పాడు? ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉన్నది? అనే ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మొదటిరోజు విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశానుసారం ఈడీ విచారణకు జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ కస్టోడియన్ శంకరలక్ష్మిని సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వీరిద్దరిని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ప్రధాన నిందితుల తొలిరోజు విచారణ సంతృప్తికరంగా సాగడంతో మరికొన్ని ప్రశ్నలతో ఈడీ అధికారులు మంగళవారం తుది విచారణ చేపట్టనున్నారు. రెండోరోజు బ్యాంకు ఖాతాలు, వచ్చిన డబ్బులు ఎవరికి? ఎలా చేరవేశారు? ఎంత సంపాదించారు? అనే అంశాలపై ఇద్దరినీ కలిపి విచారించనున్నట్టు తెలిసింది.
ఇదే కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న రేణుకరాథోడ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. బెయిల్ మంజూరు కోసం ఏ7 నిందితుడు కేతావత్ రాజేందర్, ఏ8 నిందితుడు కేతావత్ శ్రీనివాస్ తరపు న్యాయవాదులు సైతం కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.
నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సుష్మిత దంపతుల కస్టడీ పూర్తికావడంతో జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొన్న కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు సిట్ పోలీసులు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ వీరయ్య నిందితులను రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు.