హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ముందుండి పోరాడారని, ఆయన లేకపోవడం బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ పూర్వ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పెద్ది యాది సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. నర్సంపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టాలని సూచించారు. కాలేజీ ఎదుట, హైదరాబాద్లోనూ పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్ది పోషించిన పాత్ర, నర్సంపేట ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. పెద్ది లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ అబ్దుల్ నబీ, ఎమ్మెల్సీ కోదండరాం, గాదె ఇన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, మార్తినేని ధర్మారావు, తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, ప్రొఫెసర్ పాపిరెడ్డి పాల్గొన్నారు.