నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జిల్లాలోని కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగు,తాగు నీరు లేక నానాకష్టాలు పడిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ప్రజలను కోరారు.
పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పటేల్ అంజి రెడ్డి, వనం యాదగిరి, మన్నెం ఎల్లయ్య, ఏనుగుల శంకర్, మండల శంకర్, కాసర్ల లింగా రెడ్డి, మేకల బలరాం, కాడింగు వెంకన్న, కట్ట పరమేష్, అక్కినపల్లి సాలయ్య, మారగోని నర్సింహా, వనం యాదగిరి, సుంకర నర్సింహా, తదితరులు ఉన్నారు.