రామగిరి, నవంబర్ 27 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్లే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతు సంఘం 2వ మహాసభల సందర్భం గా ఆదివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల (మల్లు స్వరాజ్యం ప్రాంగణం) మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ.. ఆ తరువాత రైతులను విస్మరించారన్నారు. ఇంత ద్రోహం చేస్తున్న మోదీ లాంటి ప్రధానిని తాము ఎప్పుడూ చూడలేదని రైతులు భావిస్తున్నారని తెలిపారు. పేదల భూములు లాక్కొని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ సభలో రైతు సంఘం నేత పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.