BJP |హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో వింత పరిస్థితి ఎదురవుతున్నది. కొందరు నేతలు తమకు వద్దని చెప్పినా బీజేపీ అధిష్ఠానం టికెట్లు కేటాయించింది. కాడిపడేసినా జనసేనను 7-8 స్థానాల్లో పోటీచేయాలని కోరుతున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ మీడియా ముఖంగా ప్రకటించారు. అయినా, బీజేపీ పెద్దలు ఆయనకు టికెట్ కేటాయించారు. ఆయనతోపాటు చాలామందికి మూడో జాబితాలో సీట్లు కేటాయించారు. వారంతా రాష్ట్ర పెద్దలను కలిసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
శేరిలింగంపల్లి, తాండూరు, నాగర్కర్నూలు, కూకట్పల్లి టికెట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నది. ఇప్పటికే శేరిలింగంపల్లి, తాండూరు టికెట్లలో ఒకటి జనసేనకు కేటాయించినా పార్టీకి రాజీనామా చేస్తానని కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. జనసేనకు కేటాయించొద్దంటూ కూకట్పల్లి బీజేపీ నేతలు ఏకంగా పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు అతికించారు. ఈ నేపథ్యంలో ఆ నాలుగు టికెట్లకు బదులు రెట్టింపు సంఖ్యలో అంటే 8 టికెట్లు ఇస్తామని వేరే సీట్లు కోరుకోవాలని జనసేనకు బీజేపీ ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం. ముషీరాబాద్ టికెట్ కోసం హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మధ్య మూడు నెలల నుంచి పోరు సాగుతున్నది. తన కూతురు విజయలక్ష్మికి టికెట్ ఇప్పించుకోవాలని దత్తాత్రేయ ఢిల్లీ అధిష్ఠానం వద్ద సకల ప్రయత్నాలు చేశారు. లక్ష్మణ్ కూడా ఆ సీటును తన అనుచరుడికి కేటాయించాలంటూ పట్టుబట్టారు. చివరికి ముషీరాబాద్ టికెట్ను లక్ష్మణ్ అనుచరుడు పూస రాజుకు కేటాయి స్తూ బీజేపీ మూడో లిస్టును ప్రకటించింది.