వనపర్తి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సామాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయంగా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కేంద్రం ప్రశంసించింది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ‘లీడర్ లీడింగ్ బై ఎగ్జాంపుల్’ అంటూ కొనియాడింది.
టీబీ రోగులకు సహకారం అందించేందుకు నిక్షయ మిత్ర పేరిట కేంద్రం ఓ కార్యక్రమం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దాతల నుంచి సహకారం కోరింది. వెంటనే స్పందించిన మంత్రి నిరంజన్రెడ్డి సొంతంగా బియ్యం, నూనె, పప్పు, పండ్లు, కోడిగుడ్లు, నిత్యావసర సరుకులు ఉన్న బలవర్ధకమైన ఆహారాన్ని ప్రతినెలా అందించేందుకు ముందుకొచ్చి ఈ నెల 94 మందికి పంపిణీ చేశారు. నిరంజన్రెడ్డి స్ఫూర్తిగా మంత్రి హారీశ్రావు టీబీ రోగులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.