Lasya Nanditha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యేలు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
కార్ఖానాలోని లాస్య నందిత నివాసం నుంచి మారేడ్పల్లిలోని శ్మశానవాటికకు అంతిమయాత్ర నిర్వహించారు. అంతిమయాత్ర ప్రారంభం కంటే ముందు.. లాస్య నందిత పాడెను హరీశ్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి మోసి, నివాళులర్పించారు.
కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ ఆకాశ్పై 304ఏ సెక్షన్ కింద పటాన్చెరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి వేగంగా కారు నడిపి లాస్య మృతికి కారణమయ్యాడని ఆమె అన్నారు.