హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగా ణ): కళాశాల విద్య బలోపేతం దిశగా సర్కారు ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మన ఊ రు-మన బడి, మన బస్తీ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. ఇదే దిశగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వ కళాశాలల్లోనూ మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ ఇలా అన్ని కళాశాలలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నది. నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణంతో పాటు ల్యాబ్ల ఆధునీకరణ చేపట్టింది. 2014 తర్వా తే కొత్తగా బోరబండ, గజ్వేల్, మానూరు, సీతాఫల్మండి, బీర్కూరు, కుత్బుల్లాపూర్, నార్కట్పల్లి, మీర్పేటలో జూనియర్ కాలేజీలను మంజూరుచేసింది. ఆమనగల్లు, సిద్దిపేట, వికారాబాద్, మీర్పేట, సరూర్నగర్ కాలేజీల్లో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టింది.
కళాశాలల్లో మౌలిక వసతులు
జూనియర్ కాలేజీల్లో టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవలే రూ.27.55 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 300 కాలేజీల్లో 599 టాయిలెట్ బ్లాక్లను నిర్మిస్తున్నది. ఒక్కో టాయిలెట్ బ్లాక్ను రూ.4.6 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మరో 32.5 కోట్లనూ టాయిలెట్ల నిర్మాణానికే కేటాయించారు.
8 జూనియర్ కాలేజీలకు సొంత భవనాలు, మరికొన్ని కాలేజీల్లో అదనపు గదులు, 212 కాలేజీల్లో టాయిలెట్లు, 122 కాలేజీల్లో ప్రహరీ, 48 కాలేజీలకు ఫర్నిచర్కు రూ.301 కోట్లను వెచ్చిస్తారు.
సైన్స్ సహా ఒకేషనల్ విద్యార్థుల ల్యాబ్ల ఆధునీకరణకు రూ.4.43 కోట్లు కేటాయించింది. త్వరలోనే ఉపకరణాలు వస్తాయి.
పాలిటెక్నిక్ కాలేజీల్లో సకల వసతులు
స్వరాష్ట్రంలో 13 పాలిటెక్నిక్ కాలేజీలను మంజూరు చేసింది. వీటిలో బాలికల కోసం 4, ఎస్టీ బాలుర కోసం పాలిటెక్నిక్ కాలేజీ చొప్పున కేటాయించింది. మహేశ్వరం, మణుగూరు, సత్తుపల్లికి కొత్తగా మంజూరైన కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నాయి. 2014 తర్వాత రూ.127.33 కోట్లు వెచ్చించి 17 కాలేజీల్లో కొత్త భవనాలను నిర్మించింది. 2022 -23లో వసతుల కల్పనకు 1.55 కోట్ల అదనపు నిధులను కేటాయించింది. ఈ ఏడాదికి హైదరాబాద్ కులీకుతుబ్షా పాలిటెక్నిక్ కాలేజీలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్ల నిర్మాణం చేపడతారు. ఏఐసీటీఈ, ఎన్బీఏ నిబంధనల మేరకు 24 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో అదనపు వసతులు చేపడుతున్నారు. మాసాబ్ట్యాంక్, దుర్గాబాయి దేశ్ముఖ్, వనపర్తి, వరంగల్ కాలేజీల్లో ఎస్టీ, ఎస్టీ విద్యార్థుల కోసం నాలుగు హాస్టళ్లు నిర్మించనున్నది.
కొత్తగా 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 15 డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. రాష్ట్రంలో 136 డిగ్రీ కాలేజీలుంటే వీటిలో 11 అటామనస్ కాలేజీలు ఉన్నాయి. 2021-22 ఏడాదిలోనే తొర్రూరు, ఆత్మకూరు, హుజూరాబాద్, గంభీరావుపేట, తాండూరు, కొడంగల్లోని డిగ్రీ కాలేజీలకు నూతన భవనాలు నిర్మించారు.