నర్సంపేట, జనవరి 29: వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షం అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఇప్పటివరకు రెండెకరాలకు పైన ఉన్న రైతులకు రైతుబంధు, పాకాలకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ఆరు నెలల నుంచి తాను నర్సంపేట అభివృద్ధికి తెచ్చిన జీవోలను ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆపివేయించారని మండిపడ్డారు. మంజూరైన నిధుల్లో ఏ ఒక్క రూపాయి ల్యాప్స్ అయినా ఊరుకోబోమని హెచ్చరించారు. మూడు రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నామని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గా తానే పోటీచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందవద్దని, మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని చెప్పారు. కార్యక్రమం లో మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, జెడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్ పాల్గొన్నారు.