జగిత్యాల, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో పట్టింపులేనితనంతో ఆనవాళ్లను కోల్పోయిన జలవనరులకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ విజన్తో రూపుదిద్దుకొన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకొన్నాయి. వరదకాలువ తూములతో భూములన్నీ పారి.. కనుచూపు మేర పచ్చదనం పరుచుకొన్నది. బతుకుదెరువు లేక పట్నం బాటపట్టిన గ్రామస్థులు ఇప్పుడు ఉన్న ఊళ్లోనే దర్జాగా వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. బొంబా యి, దుబాయ్నుంచి తిరిగొచ్చి పుట్టిన ఊరిలోనే ఎవుసం చేసుకొని కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నిండుకుండలా మారి న చెరువులో నిత్యం మత్స్యకారులు చేపలవేట సాగిస్తూ పొట్టపోసుకొంటున్నారు.
జీవం పోసిన ఎస్సారెస్పీ పునరుజ్జీవం
జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల నాన్కమాం డ్ ఏరియాలుగా పేరొందాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మించి, కాకతీయ కాలువ ద్వారా నీటిని సరఫరా చేసినా ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 20 ఏండ్ల క్రితం ఎస్సారెస్పీకి అనుసంధానంగా వరద కాలువ నిర్మించినా, వరద కాలువ పరివాహకంలోని కొన్ని గ్రామాలకు నీటి సౌకర్యం లేని దుస్థితి. వరద కాలువలకు తూములు పెట్టేందుకు సమైక్య రాష్ట్రంలో పాలకులు అంగీకరించలేదు. దీం తో వరద కాలువ పరివాహక ప్రాంతాలుగా ఉన్న మల్యాల మండలం పోతారం, రాజా రం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. చెరువులకు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి. అయితే, సీఎం కేసీఆర్ విజన్తో ఇప్పుడు ఈ ఊర్లన్నీ పచ్చబడ్డాయి. కాళేశ్వరం నిర్మించి, ఎస్సారెస్పీ వరద కాలువను అనుసంధానంగా చేసుకొని ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని మొదలు పెట్టడంతోపాటు వరద కాలువలకు 34 తూ ములను ఏర్పాటు చేసి, చెరువులను నింపే ప్రక్రియ మొదలు పెట్టడంతో ఆ గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఈ ఏడాది సైతం కాలం ఆలస్యం కావడం, వర్షపు చినుకు జాడలేని తరుణంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా నీటిని చెరువుల్లోకి మళ్లించడంతో, చెరువులు పొంగి పొర్లాయి. చెరువులతోపాటు వాగులు, వంకలు పారడంతో గొలుసుకట్టు పద్ధతిలో పొందిచ్చిన చెరువులన్నీ నిండిపోయాయి. వాన జాడలేని సమయంలోనూ వరద కాలువ ప్రాంతాల్లో సేద్యం సాగుతున్నది.
పోతారమే నిదర్శనం
పోతారం..మల్యాల మండలంలోని ఒక ఊరు. జగిత్యాల-కరీంనగర్ రహదారిపై, జగిత్యాల జిల్లా కేంద్రానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో, ఎస్సారెస్పీ ప్రధాన కాలువ అయిన కాకతీయ కెనాల్కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అయితే కాకతీయ కాలువ కంటే పోతారం గ్రామం ఎగువన ఉండడంతో ఆ గ్రామం నాన్ కమాండ్ ఏరియాలోకి వెళ్లిపోయింది. గ్రామానికి పెద్ద చెరువు ఉంది. పూర్వకాలంలో చెరువు నిండి తే గ్రామస్థులకు సేద్యంతోపాటు తాగునీరు, చేపల పెంపకానికి ఎంతో దోహదపడేది. చెరువు కింద 230 ఎకరాల ఆయకట్టు ఉంది. గొలుసు కట్టు చెరువుల్లో ఒకటైన పోతారం చెరువు నిండి అలుగు పారితే గోపాలకుంట, రాజారం చెరువు మీదుగా జగిత్యాల రూరల్ మండలంలోని మోతె చెరువుకు చేరుతాయి. చెరువులపై పట్టింపు లేకపోవడం, వాతావరణంలో విపరీతమైన మార్పుల నేపథ్యంలో 50 ఏండ్లుగా పోతారం చెరువు పూడుకుపోయింది. దీనికి తోడు వర్షాలు సరిగా కురవకపోవడం, చెరువులు నింపేందుకు వేరేమార్గం లేకపోవడంతో తుమ్మలు మొలిసి ఎందుకు పనికిరాకుండా పోయింది. ఇక గ్రామంలో చెరువుపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు సైతం ఉపాధి లేకుండా పోయింది. కాకతీయ కాలువ ద్వారా చెరువును నింపాలని గ్రామస్థులు కోరినా పాలకులు పట్టించుకోలేదు. 20 ఏండ్ల క్రితం పోతారం నుంచే ఎస్సారెస్పీ వరద కాలువ తవ్వారు. ఈ కాలువకు గ్రామస్థులు సైతం భూమి ఇచ్చారు. వరద కాలువ వల్లనైనా తమ గ్రామానికి నీళ్లు వస్తాయని, చెరువు నిండుతుందని భావించారు. అయినా ప్రయోజనం లేకుండా పో యింది. దీంతో బోర్లు వేసుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. నాన్ కమాండ్ ఏరియా కావడంతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుకోవడంతో బోర్లపై వ్యవసాయం చేయడం పెద్ద ఇబ్బందికరంగా మారిపోయింది.
జూలై మొదటివారంలోనే నిండిన చెరువు
ఈ ఏడాది సైతం కాళేశ్వరం జలాలతోనే పోతారం పెద్ద చెరువు నిండిపోయింది. జూన్ గడిచి, జూలై వచ్చినా వర్షపు జాడ లేకపోవడంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జూలై 7 నుంచి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టారు. గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటిని వరద కాలువలోకి మళ్లించి అక్కడి నుంచి ఎగువకు నీటిని తరలించారు. ఈ క్రమంలోనే మల్యాల మండలంలోని పోతారం పెద్ద చెరువును కాళేశ్వరం నీటితో నింపివేశారు. 4 రోజుల వ్యవధిలోనే చెరువు నిండి మత్తడి దుంకింది. జగిత్యాల రూరల్ మండలం మోతె చెరువును నింపింది. దీంతో పరిసరాల్లో వ్యవసాయ బావులన్నింటిలోనూ నీటి ఊటలు పెరిగాయి. బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరానికి చేరుకోవంతో గ్రామస్థులు రెట్టించిన ఉత్సాహంతో సాగుబాట పట్టారు.
బొంబాయికి రాంరాం చెప్పినం
మా ఊళ్లే మ త్స్యకార కుటుంబాలు 200 దాకా ఉన్నాయి. మా అం దరికీ ఊరి చెరువే ఉపాధినిచ్చేది. చెరువు ఎండిపోవడంతో దాదాపు 50 కుటుంబాల వాళ్లం బతుకుదెరువుకు బొంబాయి పోయినం. మా చెరువు నిండుతది అన్న ఆశ వదులుకొన్నాం. సీఎం కేసీఆర్సార్ మా ఆశలకు ప్రాణం పోసిం డు. కాళేశ్వరంతో చెరువులు నింపే సౌలత్ చే సిండు. ఆరేండ్ల సంది మా చెరువు నిండుతున్నది. బొంబాయికి పోవుడు బంద్ చేసినం.
-పల్లికొండ రాజయ్య, మత్స్యకారుడు, పోతారం
మా కుటుంబానికి అన్నం దొరికింది
నిరుపేద కుటుంబం నాది. కస్కెడు భూమి లేదు. మునుపు కౌలు తీసుకొని ఎవుసం చేసేది. చెరువుల నీళ్లు లేక ఉప్పరి పనికి పోవాల్సి వచ్చింది. తిండికిగూడ తిప్పలయ్యేది. ఏం బతుకులురా ఇవి? అని ఏడ్చేది. ఆరేండ్ల నుంచి మా చెరువులకు నీళ్లు వస్తున్నయి. మళ్ల ఎవుసం పచ్చబడ్డది. ఆరెకరాలు కౌలుకు తీసుకొని చేత్తున్న. చెరువు నిండడంతోటి నాకు, నా కుటుంబానికి ఇంత అన్నం దొరికింది. కాళేశ్వరం కట్టి నీళ్లను మా ఊరి చెరువుదాకా తెచ్చిన కేసీఆర్సార్కు రుణపడి ఉంటాం.
– కట్కూరి నర్సయ్య, కౌలు రైతు, పోతారం (మల్యాల)
బతుకమ్మలు అంపేందుకుగూడా నీళ్లు లేకుండె
మొన్నటిదాకా బతుకమ్మలు, గణపతి విగ్రహాలు అంపేందుకు నీళ్లు లేని దైన్య పరిస్థితి మా ఊరోళ్లది. ఒక మాటలో చెప్పాలంటే బహిర్భూమికి పోతే కడుక్కొనేందుకు నీళ్లు లేని దుస్థితి మాది. వరద కాలువ ఉన్నా లాభం లేదు. కాకతీయ కాలువ నుంచి నీళ్లు రావు. ఇగ చెరువు నిండదు. ఊరు బాగుపడదు అనుకున్నాం. దేవుని లెక్క సీఎం కేసీఆర్సార్ వరద కాలువకు తూములు పెట్టి, కాళేశ్వరం నుచి నీటిని తరలించిండు. వరద కాలువ ద్వారా చెరువులోకి పంపే ఏర్పాట్లు చేసిండు. ఇప్పుడు ప్రతిరైతు పైసా ఖర్చులేకుండా పంట సాగు చేసుకొంటున్నడు. నిండిన చెరువులో బతుకమ్మలు, వినాయక విగ్రహాలను అంపుతున్నం.
– ఐల్నేని సాగర్రావు, సింగిల్విండో చైర్మన్, పోతారం