తొలిసారిగా సర్కారు దవాఖానలో సర్జరీ
పైసా ఖర్చులేకుండా ఖరీదైన శస్త్రచికిత్స
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 : ఉస్మానియా దవాఖాన మరో అరుదైన కాలేయ శస్త్రచికిత్సకు వేదికైంది. కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే చేసే లాపరోస్కోపి హెపటెక్టోమీ శస్త్రచికిత్సను నిర్వహించి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఇలాంటి ఆపరేషన్ తొలిసారిగా ఉస్మానియాలో చేసినట్టు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్ను పైసాలేకుండా నిర్వహించినట్టు వెల్లడించారు.
లాపరోస్కోపీ హెపటెక్టోమీ అంటే..
కాలేయంలో దెబ్బతిన్న భాగాన్ని లాపరోస్కోపి పద్ధతిలో తొలగించడాన్ని టోటల్ లాపరోస్కోపి హెపటెక్టోమీ అంటారు. కాలేయానికి క్యాన్సర్ సోకిన కేసుల్లో 90 శాతం ఈ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేస్తారని వైద్యులు తెలిపారు. సాధారణ సర్జరీ ద్వారా అయితే రోగి శరీరంపై కనీసం 12 సెంటీమీటర్ల కోత పెట్టాల్సి ఉంటుందని, లాపరోస్కోపి హెపటెక్టమీతో 5 సెంటీమీటర్ల రంధ్రం ద్వారా దెబ్బతిన్న కాలేయ భాగాన్ని తొలగిస్తారని తెలిపారు. ఈ పద్ధతిలో రోగికి పెద్దగా నొప్పి ఉండకపోవడమే కాకుండా త్వరగా కోలుకుంటారని వైద్యులు వివరించారు.