హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం నాగర్జునసాగర్ పరిసరాల్లో ఆదిమానవుల ఆనవాళ్లు వెలుగుచూశాయి. సాగర్ ఎగువన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పుట్టంగండి పంచాయతీ పరిధిలోని పావురాల గుట్ట సమీపంలో పెద్ద పలుగు గుట్టపై కొత్తరాతి యుగపు మానవులు పనిముట్లు తయారుచేసిన గుర్తులను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. గురువారం గుట్టపై మూడు చోట్ల 5 నుంచి 8 సెంటీమీటర్ల వ్యాసం, ఒక సెంటీమీటర్ లోతుతో బడిసె రాళ్లను గుర్తించినట్టు చెప్పారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పశుపాలనతోపాటు వ్యవసాయం చేసిన కొత్త రాతియుగపు మానవులు పదునైన మొనగల నల్ల శానపు రాతి గొడ్డళ్లు తయారు చేసుకునేవారని తెలిపారు. పెద్ద పలుగురాతి గుట్ట వారి పనిముట్ల తయారీకేంద్రంగా ఉండేదని గుట్టపై ఉన్న గుంతలు రుజువు చేస్తున్నాయన్నారు. గుట్టకు దిగువన కొత్త రాతియుగపు కొండచరియ ఆవాసాలను కూడా పరిశీలించామన్నారు. ఇక్కడ ఆర్కియాలాజికల్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. పర్యటనలో బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ కద్దూరి సుధన్రెడ్డి, నర్సింగరావు, పావురాలగుట్ట యువకుడు గోసంగి సైదులు పాల్గొన్నారు.