హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే వాటి యజమానులకు వందశాతం పరిహారం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వీలైనంత వరకు అసైన్డ్ భూములను సేకరించకుండా చూస్తామని, గత్యంతరం లేని పరిస్థితుల్లో.. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్టే వందశాతం పరిహారం ఇస్తునామని చెప్పారు. గతంలో అసైన్డ్ యజమానులకు పదోపరకో ఇచ్చి భూములు తీసుకొనేవారని, కొన్నిసార్లు ఏమీ ఇయ్యలేదని గుర్తుచేశారు. పేదల భూముల్ని తమ ప్రభుత్వం గుంజుకోదని చెప్పారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కంపా నిధులు కేంద్రానివి కావు. 100 శాతం రాష్ర్టాల డబ్బే. రాష్ర్టాల్లో వివిధ అవసరాలకు భూసేకరణ సహజం. డబ్బు డిపాజిట్ చేసి అటవీశాఖ భూమిని సేకరిస్తారు. ఇలా సమకూరిందే కంపా నిధి. తెలంగాణ నుంచి రూ.4,675 కోట్లు జమైంది. అన్ని రాష్ర్టాల నుంచి రూ.35,000 కోట్లు కేంద్రం వద్ద ఉన్నాయి. సుప్రీంకోర్టు స్టే వల్ల నిధులు రావట్లేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కంపా నిధులపై చర్చల కోసం ప్రధానికి వంద పిటిషన్లు ఇచ్చిన. ఓసారి పంచాయితీ కూడా పెట్టుకున్న. సుప్రీంకోర్టుతో సంప్రదించి ప్రత్యేక చట్టం తెచ్చి నాలుగేండ్లు నిధులు విడుదలచేశారు. ఇప్పటివరకు రూ.3,109 కోట్లు రాష్ర్టానికి వచ్చాయి.
అడవులను పెంచే క్రమంలో అక్కడక్కడ కొందరు అధికారులు అడవుల మీద ఆధారపడిన గిరిజనులను డిస్టర్బ్ చేస్తున్నరు. కొన్ని సందర్భాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది వాంఛనీయం కాదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అటవీ భూమి కింద నోటిఫై అయిన ల్యాండ్ ఓనర్షిప్ మారదు. వాటిని మనం ఏం చేయలేం. చివరికి సుప్రీంక్రోర్టు తీర్పు మేరకు యూపీఏ హయాంలో ఒక చట్టం తెచ్చిన్రు. 2005 కటాఫ్ డేట్ పెట్టి పోడు రైతుల లెక్కలు తీసిన్రు. మన దగ్గర కొంత మేరకు పట్టాలు ఇచ్చిన్రు. 96,676 మంది గిరిజనులకు 3.80 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన్రు. మనం రైతుబంధు స్టార్ట్ చేసినప్పుడు వాళ్లకు రాలేదు. ఓ సందర్భంలో గిరిజన ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకొస్తే వాళ్లు కూడా వ్యవసాయం చేసుకుంటున్నరు కాబట్టి రైతుబంధు ఇయ్యాలని చెప్పి ఇస్తున్నం. మిగిలినవారిని మానవతా దృక్ఫథంతో ఆదుకోవాల్సి ఉన్నది. పోడు భూముల వ్యవహారాన్ని తేలుస్తామని గతంలో మేము హామీ ఇచ్చినం. మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసినం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన 3.80 లక్షల ఎకరాలు కాకుండా ఎంత భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నరో లెక్క తేలాల్సి ఉన్నది. దాదాపు ఆరేడు లక్షల ఎకరాల పోడుభూములు ఉన్నట్టు నాకు సమాచారం. అక్కడికి స్టాప్ చేసి వాళ్లకు కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు, రైతుబంధు ఇచ్చేస్తే సమస్య సమసిపోతది. ఇది సాధ్యం కావాల్నంటే 2005 కటాఫ్ను పొడిగించాలని కేంద్రాన్ని మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంటది. ఈ సమావేశాల్లోనే ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపిద్దాం. అవసరమైతే అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రిని కలిసి పరిష్కరించాలని కోరుదాం. ఇప్పుడున్న 3.80 లక్షలతోపాటు కొత్తగా ఆరేడు లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 10 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి అక్కడికి స్టాప్ చేసి, ఇకపై ఆక్రమణలు ఉండొద్దని చెప్పుదాం.
పోడు రైతులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినంత మాత్రాన ఓనర్లు కారు. అటవీశాఖనే యజమానిగా ఉంటది. రైతులకు కొన్ని సదుపాయాలు వస్తయి. వారి జీవనోపాధి కోసం ఆ భూమిని ఉపయోగించుకొనేందుకు వీలుంటుంది. విలువైన ఫల వృక్షాల వంటివి పెంచుకొనే అవకాశం ఉంటుంది. మన గిరిజనుల మీద రెండు రకాల దాడులు జరుగుతున్నయ్. ఆదిలాబాద్లో మహారాష్ట్ర లంబాడీలు వచ్చి నాలుగు రోజులు ఉండి నేటివ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు సంపాదిస్తున్నరు. దాంతో మనవాళ్లకు అందాల్సిన సదుపాయాలు, విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నయ్. ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాల్లో ఛత్తీస్గఢ్ నుంచి గొత్తికోయలు వచ్చి సక్కగా అడవి మధ్యకు పోయి అడివిని కొట్టేసి తెల్లారేసరికి క్యాంపులు పెట్టేస్తరు. ఇది కూడా పెద్ద సమస్యగా తయారైంది. తాతల కాలం నుంచి ఉన్నవాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
భద్రాచలం పరిధిలో ఐదు గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏపీ వాళ్లు సీలేరు పవర్ ప్లాంట్తోపాటు ఏడు మండలాలను గుంజుకున్నరు. ఇష్టమున్న పరిధిలో గీత గీసి గ్రామాలను తీసుకున్నరు. దానివల్ల భద్రాచలం టౌన్లో కొంత భాగం పోయింది. దానిమీద అప్పట్లో ప్రధానిపై చాలా ఘాటుగా ‘ఇది నియంతృత్వం’ అని విమర్శించిన. నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన. ఐదు గ్రామాలపై రెండు ప్రభుత్వాలు కలిసి ప్రతిపాదన చేయాలని అనుకున్నం. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి. ఏపీలోని కొత్త ప్రభుత్వంతో కూడా మాట్లాడిన. వాళ్లు నోటి మాటకు ఒప్పుకుంటున్నరు. పేపర్ మీద పెట్టుమంటే వెనుకాడుతున్నరు. తప్పకుండా మరోసారి మాట్లాడుదాం. ఒప్పుకోకుంటే ప్రధాని దగ్గరికిపోయి గట్టిగ కొట్లాడుదాం.