హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఇప్పుడు ఎక్కడచూసినా భూ విలువ పెంపుపైనే చర్చ. రాష్ట్రంలో భూమి విలువను పెంచాలని సర్కారుకు మంత్రివర్గ ఉపసంఘం సూచించిన నేపథ్యంలో భూమి రేటును ఎలా నిర్ణయిస్తారు? ప్రక్రియ ఏంటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూ విలువను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తుంది. మార్కెట్ విలువను పెంచేముందు రిజిస్ట్రేషన్లశాఖ పట్టణ, గ్రామీణ స్థాయుల్లో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు నేతృత్వం వహిస్తారు. సబ్ రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలు స్థానికంగా బిల్డర్లు, రియల్టర్లు, ఇతర నిర్మాణరంగ ప్రతినిధులతో సమవేశమై వారి అభిప్రాయాలను తీసుకుంటాయి. ప్రభుత్వ మార్కెట్ విలువకు, ప్రస్తుతం బహిరంగ మారెట్లో ఉన్న ధరలకు మధ్య తేడాలను గుర్తించి, ఎంతమేర పెంచవచ్చో ప్రభుత్వానికి నివేదిస్తాయి. ఆ తర్వాత ఉన్నతాధికారులు సమీక్షించి, సీఎంకు నివేదిక అందజేస్తారు.