హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వీటికి స్థలాల సమస్య పట్టిపీడిస్తున్నది. ఆరు నియోజకవర్గాల్లో స్థల సేకరణ సమస్యలు ప్రాజెక్ట్కు అడ్డంకిగా మారాయి. ప్రతిపాదిత స్థలాలు అనేక చిక్కుల్లో ఉన్నాయి. ఎన్వోసీల జారీలో జాప్యం.. కోర్టు కేసుల వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో భూసేకరణ, స్థల అనుకూలత వంటి సమస్యలు కూడా గుదిబండగా మారాయి. టెండర్లు ఖరారైనా పనులు యథావిధిగా సాగని పరిస్థితి నెలకొన్నది. ఏండ్లు గడుస్తున్నా పురోగతి కానరావడంలేదు. దీంతో ఇవి ఎప్పుడు పూర్తవుతాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకులాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. ఇప్పటివరకు 85 పాఠశాలలకే పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. మరో 20 నియోజకవర్గాలకు పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది. 85లో 81 స్కూళ్లకు టెండర్లు పిలువగా..78 టెండర్లు ఖరారయ్యాయి. మరో మూడు టెండర్లకు సాంకేతిక మూల్యాంకనం నడుస్తున్నది. మరోనాలుగు టెండర్లు ఇంకా పిలువాల్సి ఉంది. ఖరారైన 78 టెండర్లలో 64 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 9 చోట్ల కాంట్రాక్టర్ల మొబిలైజేషన్ అడ్వాన్స్లిచ్చే స్థితిలో ఉన్నాయి.