హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో ని సమావేశ మందిరంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాల తో కలిసి పలు అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంగా ఆలయం అభివృద్ధి, విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీ మేరకు ఆలయ విస్తరణ కు అవసరమైన 1100 గజాల స్థలాన్ని గుర్తించామన్నారు. భూ యజమానులు కూడా స్థలం అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం భూమి అప్పగిస్తున్న వారికి పరిహారంగా ప్రభుత్వం రూ. 8.95 కోట్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు.
పేద ప్రజల అవసరాల ను దృష్టిలో ఉంచుకొని కంచన్ బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్ లలో మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. వివాహ, ఇతర శుభ కార్యాలు జరుపుకునేందుకుగాను ఈ ఫంక్షన్ హాళ్ల కోసం రూ. 19 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. ఉప్పుగూడ హాల్ కు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన రెండు హాల్స్ కు కూడా త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
10 రోజులలో భూమి పూజ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ సీఈ జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.