Dharmapuri | ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వామనాచార్యుల ఆద్వర్యంలో ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పుర్ణాహుతి అనంతరం శ్రీలక్ష్మీనరసింహ(యోగ, ఉగ్ర), వేంకటేశ్వరస్వామి, రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన మూడు రథాలపై ప్రతిష్టించారు. ఆ తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం రథాలను క్షేత్రంలోని పట్టణ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి ఇసుక స్తంభం మీదుగా నంది చౌక్ వరకు రథోత్సవం కొనసాగింది. గోవిందనామస్మరణతో ధర్మపురి వీధులో మార్మోగాయి. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వామివారలకు ఘన స్వాగతం పలికి, మొక్కులు చెల్లించారు. అనంతరం అర్చకులు రాత్రివేళలో గోదావరిలో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆలయంలో పుష్పయాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రం రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. లక్ష్మీనారసింహస్వామి రథోత్సవంలో మంతి పాల్గొన్నారు. రథాలపై ప్రతిష్టించిన స్వామివారలను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రూ.141కోట్లతో ప్రస్తుతం ధర్మపురి క్షేత్రం, పట్టణాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రారంభించిన పనులన్నీ పూర్తయితే ధర్మపురి రూపురేఖలు మారిపోతాయన్నారు.
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే గత పదిరోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు జరుగకుండా తగు ఏర్పాట్లు చేసిన దేవస్థాన సిబ్బంది, రెనోవేషన్ కమిటీ సభ్యులను, అన్నదానం కార్యక్రమ దాతలను మంత్రి అబినందించారు. అంతకు ముందు మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.