Komuravelli | చేర్యాల, జనవరి 28 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరి హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దిగంబరంగా అనుమతి ఇవ్వలేమని, వస్ర్తాలు ధరించి రావాలని ఆలయవర్గాలు సూచించడంతో బయటకు వచ్చి కారులో ఉన్న కత్తి తీసుకుని భక్తులపై దూయడంతో ఒక్కసారిగా వారు పరుగులు తీశారు.
పోలీసులు చేరుకుని ఆమెను శాంతింపజేసేందుకు యత్నించారు. వినకుండా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిని కత్తితో అడ్డుకోవడంతో సెల్ఫోన్ పగిలిపోయింది. ఆలయవర్గాల విజ్ఞప్తితో అఘోరి వస్ర్తాలు ధరించి వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్లిపోయారు.