ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్
సిరిసిల్ల రూరల్, జూన్ 17: సౌదీలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గురువారం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లాడు. నాలుగునెలల క్రితం పెద్ద కూతురి వివాహం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు పెరగడం, అక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో మనోవేదనకు గురైన కనుకయ్య సౌదీలోనే మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా పరిస్థితులు ఉన్నా కనుకయ్య మృతదేహం తెప్పించేందుకు మంత్రి కేటీఆర్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. కనుకయ్య మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆయనకు భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.