నిజామాబాద్ :షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీలు(Labana Lambadis )స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, మూడో సారి బి ఆర్ ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి, తమ సమస్యలు పరిష్కరించేది ఖాయమని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నట్లు ప్రకటించిన తమ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. ఎంపీ బీబీ పాటిల్ అధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ను వారు కలిశారు. ఈ సందర్భంగా లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర విషయాల గురించి మంత్రికి విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. షెడ్యూలు తెగల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, సామాజిక, రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించారన్నారు. గిరిజనుల కల సాకారం చేసేలా, నాలుగు లక్షల ఎకరాలకు పైన పోడు పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని చెప్పారు. న్యాయ సలహా అనంతరం, సీఎం కేసీఆర్ ఆదేశానుసారం లబానా లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాన్ని తప్పక పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో లబానా లంబాడీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ తాన్ సింగ్ నాయక్, అమర్ సింగ్ నాయక్, చందా నాయక్, బిషన్ లాల్, జగదీష్, గంగారాం, దర్బార్, గోపాల్ తదితర నాయకులు ఉన్నారు.