హైదరాబాద్: రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) అన్నారు. వేలాది అర్చక కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో పేద బ్రాహ్మణులను అనేక విధాలుగా ఆదుకున్నారన్నారు. 2017లో రూ.వంద కోట్లతో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఆలయాల్లో అర్చకులకు కేసీఆర్ గౌరవ వేతనం ఇచ్చారని గుర్తుచేశారు. ధూపదీప నైవేధ్య పథకంలో భాగంగా ప్రతి ఆలయానికి నిధులిచ్చారని తెలిపారు. వృద్ధులైన వేద పండితులకు ఆర్థిక సాయం అందించారని వెల్లడించారని, బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఫెలోషిప్ ఇచ్చారని చెప్పారు.
కొత్త ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణులకు కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. విదేశీ విద్యానిధి కింద చదువుకుంటున్న విద్యార్థులు బాధపడుతున్నారని చెప్పారు. విదేశీ విద్యానిధికి రూ.30 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్స్కు రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉందని, బ్రాహ్మణపరిషత్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వెంటనే వారికి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.