పరిశీలించిన పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా కూసుమంచి పంచాయతీ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న 13వ శతాబ్దికి చెందిన శివాలయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. దట్టమైన చెట్లు, ముళ్ల కంపలు, పొదలను తొలగించుకుంటూ అతికష్టం మీద ఆయన ఆలయంలోకి చేరుకొన్నారు. ఈ ఆలయం కాకతీయ గణపతిదేవుని కాలంలో నిర్మించిన గణపేశ్వరాలయ వాస్తు శిల్పాన్ని పోలి ఉందని చెప్పారు. రాతి కిటికీలు, గోడ పైభాగంలో ఆలయం చుట్టూ రాతి వెంటిలేటర్ ఏర్పాటు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత అని వివరించారు.
16 స్తంభాల రంగమండపం పైకప్పు, గర్భాలయంపై ఇటుక రాతి విమానం కూలిపోయాయని తెలిపారు. ద్వార మండపం ముందు నల్లశాసనపురాతితో చెకిన నెమలి వాహనంపై ఉన్న వల్లీ సుబ్రహ్మణ్య శిల్పం వంగిపోయిందని చెప్పారు. గ్రామస్థుల సహకారంతో ఆలయాన్ని పరిరక్షించుకోవాలని సర్పంచ్కి శివనాగిరెడ్డి సూచించారు. ఆయన వెంట కొత్త తెలంగాణ చరిత్ర బృందం కో-కన్వీనర్ కట్టా శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ చెన్నమోహన్, ఉపాధ్యాయులు వీరస్వామి, లక్ష్మి ఉన్నారు.