చండూరు: మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకార్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు.
చండూరు మండలం ఉడుతలపల్లిలో పరిగి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్నానని, ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులన్నారు. మరోసారి గెలిపిస్తే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని హామీఇచ్చారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని.. రాజగోపాల్ రెడ్డికి దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వాలన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి మంత్రి గంగుల కమలాకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. బీజేపీకి బుద్ధిచెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
మునుగోడుకు రాజగోపాల్రెడ్డి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆయనకు కాంట్రాక్టులు తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. ప్రజాసమస్యల కోసం ఏనాడూ మాట్లాడలేదన్నారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ రెడ్డి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.
నారాయణపురం మండలంలోని గుజ్జలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం నిర్వహించారు. డిపాజిట్లు దక్కించుకోవడం కేసమే కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అన్ని విధాలుగా విఫలమయిందని, అందుకే పెద్దఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హయాంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని రాజగోపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.