హైదరాబాద్: సీపీఎం సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ లీడర్లు సంతాపం తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి గారి మృతి రైతాంగ ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ నెల్లికంటి సత్యం తెలిపారు. వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ, సాగునీటి ప్రాజెక్టులపై మల్లారెడ్డి గారికి ఉన్న విశేషమైన అనుభవం, అవగాహన ఎంతో గొప్పవని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ప్రజా, రైతాంగ సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన మల్లారెడ్డి గారి సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని నెల్లికంటి సత్యం ఆకాంక్షించారు.
సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. మల్లారెడ్డికి అన్ని అంశాలపై పట్టు ఉన్న మేధావి అని, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై తనకు పూర్తి అవగాహన ఉన్నదన్నారు. ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులని వారన్నారు. వారి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, రైతాంగ ఉద్యమానికి తీరని లోటన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు నాకు గాని, జూలకంటి రంగారెడ్డికి గాని, కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు తన సూచనలు, సలహాలు ఎంతగానో ఉపయోగపడేవని వారన్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.