హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా దొంగ ప్రమాణాలు ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు ఇంకెంతకాలం చేస్తారని ప్రశ్నించారు.
బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేసిన తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. అనేక రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసింది నిజం కాదా? మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని దొడ్డి దారిన కూల్చింది మీరు కాదా? అని నిలదీశారు. ఆయా రాష్ర్టాల్లో బీజేపీ అగ్రనేతలతో ఆలయాల్లో బండి సంజయ్ ప్రమాణాలు చేయించాలని సవాల్ విసిరారు. నిజంగా బండి సంజయ్కి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే ఆలయాల్లో ప్రమాణాలు ఆపి, సుప్రీంకోర్డు జడ్జితో విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.