హైదరాబాద్ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెగా పవర్లూం క్లస్టర్ ఏర్పాటు సహా తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం కేంద్రమంత్రులకు లేఖ రాశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర చేనేత, జౌళీశాఖ మంత్రి పీయూష్ గోయల్కు మరోసారి లేఖ రాశారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని, దాంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు.
కేఎంటీపీ వంటి భారీ ప్రాజెక్ట్లు సముచితంగా లబ్ధి పొందేందుకు వీలుగా ‘టెక్స్టైల్ మరియు అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి (MRTA)’ విధానాన్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ అయ్యే విధంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేస్తుందని, ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక సౌకర్యాలతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
సిరిసిల్లలో మెగా పవర్లూం క్లస్టర్ను మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ 993.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం రూ.49.84 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్క్, చేనేత, అపెరల్ పార్కుల నిర్వహణకు, వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆధునీకరణ.. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదల.. పరిపాలన, అధ్యయనాల నిమిత్తమై కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సిరిసిల్లలో వర్కర్ టూ ఎంటర్ ప్రెన్యూర్ స్కీమ్, అపెరల్ పార్క్, వీవింగ్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ను మరింత అభివృద్ధి పరిచేందుకు పార్క్లో సీఎఫ్సీని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా మొత్తం రూ.756.97 కోట్లు మంత్రి చెప్పారు.
తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరిలో ఉన్న ఐఐహెచ్టీని రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో భాగమైందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులను అందించే సంస్థ ఏదీ లేదని తెలిపారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించేందుకు అవసరమైన వసతులన్నీ ఉన్నాయని, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని హ్యాండ్లూం పార్క్లో భవన సదుపాయంతో పాటు, తగినంత స్థలం కూడా అందుబాటులో ఉందని చెప్పారు.
ఐఎన్-ఎస్ఐటీయూ ( IN-SITU) పథకం కింద మరమగ్గాల అప్గ్రేడేషన్ కోసం నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఖర్చులో 50శాతం ఖర్చులు భరించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉందని చెప్పారు. మిగతా 13,886 పవర్ లూమ్లను అప్గ్రేడ్ చేయడానికి తన వంతుగా 50శాతం కేంద్ర ప్రభుత్వం రూ.13.88కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. దీంతో పాటు అప్గ్రేడేషన్ పూర్తయ్యే ఐఎన్-ఎస్ఐటీయూ పథకాన్ని కొనసాగించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం పవర్లూమ్ల లో 80 శాతం పవర్లూంలు ఒక్క సిరిసిల్లలోనే ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్డీపీ NHDP కింద 11 బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఎస్ఎల్పీసీతో దాదాపు 2579 మందికి ప్రయోజనం కల్పించే ప్రాజెక్టని. అంచనా వ్యయం 14.80కోట్లు అని తెలిపారు. 11 ప్రతిపాదిత బీఎల్సీ కోసం అమలు చేసే ఏజెన్సీ హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ టెక్స్టైల్ కాంప్లెక్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (TSTCCSL) అని పేర్కొన్నారు.
రూ.6.02 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో మరో నాలుగు బీఎల్ఎసీల మంజూరుకు సంబంధించిన మరిన్ని ప్రతిపాదనలు కూడా మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వీటి కోసం సంబంధిత ప్రాథమిక నేత సహకార సంఘాలు అమలు చేసే ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయని చెప్పారు. ఎన్హెచ్డీసీ కింద 15 బ్లాక్ లెవల్ హ్యాండ్లూం క్లస్టర్లు మంజూరు చేయాలని కేటీఆర్ కోరారు. 8 బ్లాక్ లెవల్ క్లస్టర్ల కోసం రెండో విడత ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఇందుకు రూ.7.20 కోట్లను కేంద్రం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో చేనేత రంగ సమగ్ర అభివృద్ధికి ఎన్హెచ్డీపీ కార్యక్రమం చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల ప్రణాళికలో ఎన్హెచ్డీపీ కింద బీఎల్సీలను కొనసాగించాలని కోరారు. వీటన్నింటితో పాటు, హైదరాబాద్లో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మంత్రి లేఖలో కోరారు.
భారీ టెక్స్టైల్ ప్రాజెక్ట్లకు సాయపడేలా సవరించిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండ్ (ATUF) పథకం కింద బ్యాంక్ ఫైనాన్సింగ్ నిబంధనలను సడలించాలన్నారు. తెలంగాణలో కొత్త టెక్స్టైల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్న టెక్స్టైల్ కంపెనీలకు, భారీ టెక్స్టైల్ ప్రాజెక్టులకు ఏటీయూఎఫ్ పథకం కింద బ్యాంకు ఫైనాన్సింగ్ నిబంధనలను సడలించాలని సూచించారు. ప్రాజెక్ట్ టర్మ్ లోన్ ఫైనాన్సింగ్ అవసరాన్ని ప్రస్తుతం ఉన్న 50శాతం నుంచి.. ప్రాజెక్ట్ వ్యయంలో నామమాత్రంగా 5శాతానికి సడలించాలని విజ్ఞప్తి చేశారు.
నోటిఫైడ్ లెండింగ్ సంస్థల ద్వారా తగిన ప్రాజెక్ట్ స్క్రూటినీ కి సహకరించడమే కాకుండా, కంపెనీలు తమ ప్రాజెక్ట్లకు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుంది చెప్పారు. తెలంగాణ చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.