14 మంది ప్రధానులు 56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే ఎనిమిదేండ్లలో 100 లక్షల కోట్ల అప్పులు చేసిపెట్టారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం ఉన్నది కాబట్టే డాలర్తో పోల్చితే రూపాయి విలువ రూ.60కి పెరిగిందని విమర్శలు చేశారు. మరి ఇప్పుడు ఎంతున్నది? రూపాయి విలువ రూ.82కు పడిపోయింది. మోదీ హయాంలో పక్కా సెంచరీ (రూ.100) కొడతారు. మరి ఇప్పుడు ఎవరు అసమర్థులో చర్చ జరగాలి.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ తన తొమ్మిదేండ్ల పాలనలో దేశానికి ఏం మేలు చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రధాని మోదీ ఆ డబ్బుతో చేసిన ఒక మంచి పనిని కానీ, చేపట్టిన గొప్ప ప్రాజెక్టును గానీ చూపించగలారా? అని నిలదీశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి మారకం విలువ, గ్యాస్ ధరలు.. ఇలా అన్ని అంశాల్లోనూ దేశాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టారని విమర్శించారు. మతవిద్వేషాలు, విభజన రాజకీయాలతో ఈ అంశాలపై చర్చ జరుగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అందుకే సీఎం కేసీఆర్ దేశం ముందు ప్రత్నామ్నాయ ఎజెండా ఉంచుతున్నారని చెప్పారు. దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ను జాతీయ మీడియా చానల్ ‘టైమ్స్ నౌ’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే…
సరైన ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడే సరైన ఫలితం వస్తుంది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఎఫ్డీఐ నిబంధనలు, వాణిజ్య ఒప్పందాలు వంటివి మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మిగతావన్నీ రాష్ర్టాల పరిధిలో ఉంటాయి. కంపెనీల ఏర్పాటుకు భూములు, కరెంటు, నీటి సరఫరా, మానవ వనరులు వంటి మౌలిక వసతుల అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. దావోస్లో భారత్ నుంచి ఐదారు రాష్ర్టాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. తమ రాష్ట్రంలోని వసతులను, పారిశ్రామిక అనుకూల విధానాలను వివరిస్తున్నాయి. అయినా.. పారిశ్రామికవేత్తలు తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా గుర్తిస్తున్నారు.
ఎంవోయూలు కుదుర్చుకొని ఆ తర్వాత గాలికి వదిలేసేందుకు మేము ‘వైబ్రంట్’ తరహా సదస్సులు నిర్వహించడం లేదు. కంపెనీలతో నిజమైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఆ సంస్థలు తరలివచ్చేలా చూస్తున్నాం. ఎనిమిదన్నరేండ్లలో తెలంగాణకు 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఫలితంగా 21 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాం. కేవలం సెల్ఫ్ డిక్లరేషన్తో కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం కల్పించాం. ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి విధానం లేదు. అంతేకాదు.. లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణ లీడర్గా ఉన్నది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 33 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఎఫ్డీఏ అనుమతులు పొందిన కంపెనీల్లో అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే.. నాలుగో పారిశ్రామిక విప్లవంలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని మేం నమ్మకంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ లైఫ్ సైన్సెస్లో మాత్రమే కాదు.. ఐటీలోనూ గ్లోబల్ లీడర్. అందుకే.. విదేశీయులకు, ఎన్నారైలకు హైదరాబాద్ గురించి చెప్పేటప్పుడు ‘మా నగరం దక్షిణ, ఉత్తర భారతదేశాల సమ్మేళనం. ఇక్కడ దోశతోపాటు రోటీ దొరుకుతుంది. బయాలజీతో టెక్నాలజీ స్నేహం చేస్తుంది. లైఫ్ సైన్సెస్తో డాటా సైన్స్ను కలుపుతుంది. మ్యాంగో వర్స్ నుంచి మెటా వర్స్ వరకు అన్నింటికీ కేంద్ర స్థానం’ అని చెప్తుంటాను. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్లలోనే నిర్మించాం. ఇప్పటికీ త్రీగార్జెస్ డ్యామ్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ గురించి ప్రచారం జరగడం లేదు. ఈ ప్రాజెక్టు కింద 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి. 2022లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు. 2014తో పోల్చితే 500 శాతం పెరిగింది. అందుకే తెలంగాణను స్వాతంత్య్ర అనంతర భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా పిలుస్తుంటాను.
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. హైదరాబాద్ రాష్ర్టానికి మాత్రం ఒక సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ మిగులు రాష్ట్రంగా ఉన్నది. 1952లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలిపారు. అప్పుడు కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమే. 1968లో ఉద్యమం జరిగినప్పుడు కూడా హైదరాబాద్ మిగులు రాష్ట్రంగానే ఉన్నది. ఇవన్నీ నేను సొంతంగా చెప్తున్నవి కాదు. అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి బీపీఆర్ విఠల్ వంటి వారు చేసిన కేస్స్టడీలు ఉన్నాయి. 2001లో మళ్లీ ఉద్యమం మొదలైనప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం మిగులు రాష్ట్రంగానే ఉన్నది. అంతేగానీ ఎవరో వచ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్కు 440 ఏండ్ల గొప్ప చరిత్ర ఉన్నది. ఇది ఎప్పటి నుంచో ధనిక రాష్ట్రం. హైదరాబాద్ పరిపాలకుడు నిజాం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడని టైమ్ మ్యాగజిన్ వెల్లడించింది. అప్పట్లోనే హైదరాబాద్ తన సొంత ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ, రైల్వే లైన్ గల రాష్ట్రం. చెన్నై వంటి ప్రఖ్యాత నగరాల కన్నా చాలా ముందే హైదరాబాద్లో విద్యుత్తు ఉన్నది. రాష్ట్రంలో 1908లోనే కరెంటు ఉన్నది. విభజన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు. గతేడాది జూన్నాటికి ఎగుమతులు రూ.1.83 లక్షల కోట్లకు పెరిగాయి. ఇండియా వృద్ధి రేటు 9 శాతం ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 16 శాతం. ఈ విషయాన్నే మేం చెప్తున్నాం. అంతేతప్ప హైదరాబాద్ను మేమే నిర్మించాం అని చెప్పడం లేదు.
నా దృష్టిలో చివరి ఆరు నెలల్లో రాజకీయాలు చేయడం అనేది ఆదర్శనీయం. కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ 24 గంటలు ఎన్నికల ధ్యాసలోనే ఉంటున్నది. ఒకరోజు ఒక ఎలక్షన్ పూర్తికాగానే మరోచోట ఎన్నికల తతంగం మొదలవుతున్నది. దీంతో మేము కూడా అప్రమత్తం కావాలి. దేశంలో ప్రస్తుతం ఇంకో సమస్య ఏమిటంటే లాజిక్ కన్నా మ్యాజిక్ను ఎక్కువగా నమ్ముతుంటారు. గ్యాస్ సిలిండర్ కోసం దేశ మహిళలు ప్రపంచంలోనే అత్యధిక ధర చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పాలి. అత్యధిక నిరుద్యోగిత రేటు, అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నది. వీటిపైనా చర్చ జరగాలి. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం ఉన్నది కాబట్టే డాలర్తో పోల్చితే రూపాయి విలువ రూ.60కి పెరిగిందని విమర్శలు చేశారు. మరి ఇప్పుడు రూపాయి విలువ రూ.82కు పడిపోయింది. మోదీ హయాంలో పక్కా సెంచరీ (రూ.100) కొడతారు. మరి ఇప్పుడు ఎవరు అసమర్థులో, ఎవరు అవినీతిపరులో చర్చ జరగాలి. మోదీ ఎంత అసమర్థుడనేది ఎవరూ ఆలోచించడం లేదు. మోదీకి ముందు దేశాన్ని 14 మంది ప్రధానులు పరిపాలించారు. వారంతా కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కడే ఒంటిచేత్తో ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసిపెట్టారు. ఇప్పుడు దేశంలో ప్రతి పౌరుడిపై రూ.1.25 లక్షల అప్పును మోపారు. దీనిపైనా ఎవరూ మాట్లాడటం లేదు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలకు తెలియాలంటే ప్రతిపక్షాలు గళమెత్తాల్సిందే.
ఉజ్వల యోజన అనేది మోదీ హయాంలో అతిపెద్ద విఫల పథకం. మోదీ ఎన్నికల్లో గెలిచేందుకే ఉపయోగపడింది తప్ప మహిళలకు ఒరిగిందేమీ లేదు. యూపీలో ఉజ్వల పథకం కింద మోదీ చేతుల మీదుగా సిలిండర్ తీసుకున్న మహిళ ఇప్పుడు వంట చేసుకొనేందుకు కట్టెల పొయ్యి వాడుతున్నది. కట్టెల కోసం అడవులకు వెళుతున్నది.
ప్రధానమంత్రి ఎవరు అవుతారనేది సమస్యే కాదు. పదవి బదిలీ అయినంత మాత్రాన దేశం మారిపోతుందనేదేమీ లేదు. 2014కు ముందు చాలా కథలు విన్నాం. దేశానికి మంచి రోజులు వస్తాయి, అద్భుతం జరుగుతుంది, గుజరాత్ మాదిరిగానే దేశమంతా మంచి రోజులు వస్తాయి అని ఊదరగొట్టారు. ఇన్నేండ్లలో ఎవరికి మంచి రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అది ఎక్కడికి పోయింది. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. అవి ఏమయ్యాయి. మొత్తం రంగుల కలను చూపించారు. ఇప్పటికీ దేశం మొత్తం వారి మత్తు నుంచి తేరుకోలేకపోతున్నది. మేం ప్రత్యామ్నాయ ఎజెండాను దేశం ముందు ఉంచుతున్నాం. ఏ అంశాలపై దృష్టిపెడితే దేశం మళ్లీ అభివృద్ధి పథంలో వెళ్తుందో వివరిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ఏమీ చేయలేదంటున్నారు.. మరి తొమ్మిదేండ్లలో దేశాభివృద్ధి కోసం బీజేపీ ఏం చేసింది? ఒక్కటైనా చెప్పగలరా? అప్పు చేసిన రూ.100 లక్షల కోట్లతో చేపట్టిన ఒక్క ప్రాజెక్టునైనా చూపించగలరా?
మా అభివృద్ధి లెక్కలు మేం సొంతగా చెప్పినవి కాదు.. ఆర్బీఐ ప్రకటించినవి. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.2.78 లక్షలు అయ్యింది. యూపీ తలసరి ఆదాయం దాదాపు రూ.75 వేలు ఉంటుంది. అలాంటి రాష్ట్ర సీఎం వచ్చి ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు సూక్తులు చెప్తారు. మేం రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాం. దీని గురించి ప్రధాని ఎక్కడా మాట్లాడరు, అభినందించరు. కానీ మాకు జల్జీవన్ మిషన్ కింద అధికారులు అవార్డులు ఇస్తుంటారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన కింద దేశంలోనే 20 అత్యుత్తమ పంచాయతీలను ప్రకటిస్తే అందులో తెలంగాణలోనే 19 ఉన్నాయి. ఓవైపు వాళ్లే అవార్డులు ఇస్తారు, మరోవైపు వాళ్లే విమర్శలు చేస్తుంటారు. ఇదా నీతి?
1987లో ఆర్థికంగా భారత్, చైనా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లకు చేరితే మనం ఇంకా 3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఉన్నాం. మరి 35 ఏండ్లలో ఏం అభివృద్ధి జరిగినట్టు? ఏ రాజకీయ పార్టీ అయినా ఐదేండ్లలో చివరి ఆరు నెలలు రాజకీయం చేయొచ్చు, మిగతా నాలుగున్నరేండ్లు అభివృద్ధి గురించే ఆలోచించాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు టీమిండియా అన్నారు, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్నారు. ఇది అమలయితే బాగుండేది. కానీ ఇలా జరగడం లేదు. గత 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, 45 ఏండ్లలోనే అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక సిలిండర్ ధర, డాలర్తో పోల్చితే పాతాళానికి పడిపోయిన రూపాయి విలువ వంటివి వెక్కిరిస్తున్నాయి. మాది కొత్త రాష్ట్రం. కాబట్టి కేంద్రంతో సఖ్యంగా ఉన్నాం. కేంద్రం తోడ్పాటు అందిస్తుందని ఎదురుచూశాం. కానీ తెలంగాణను బదనాం చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తున్నది. గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ సగటున 15 శాతం వృద్ధిరేటు సాధించింది. ఇదే తరహాలో దేశంలోని మిగతా 27 రాష్ర్టాలు పనిచేసి ఉంటే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది.
నేను ప్రతిపక్షాల ప్రతినిధిగా మాట్లాడడం లేదు. మా పార్టీ విధానాలను, చిన్న రాష్ట్రమైన తెలంగాణలో మా నాయకుడు సీఎం కేసీఆర్ సాధించిన విజయాలను గురించి మాత్రమే చెప్తున్నాను. తెలంగాణ నాలుగేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించినప్పుడు, ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వగలిగినప్పుడు, రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నప్పుడు మిగిలిన దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదని మా నాయకుడు ఈ దేశ ప్రజలను, కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఓవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరోవైపు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు దేశమంతా ఎందుకు సాధ్యం కాదని ఆలోచింపజేస్తున్నారు. ఈ దేశంలోనే మాకన్నా మెరుగైన పాలన, అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఏదైనా ఉంటే చూపించాలని దేశంలోని ఇతర రాష్ర్టాల నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నా.