హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గ్రామీణ ప్రజల్లో ఉన్న వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందిలో వినూత్న ఆవిష్కరణలు చేసేవారు, సృజనాత్మకత కలిగినవారు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
శుక్రవారం ప్రగతి భవన్లో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్ 2022 పోస్టర్ను 10 మంది గ్రామీణ ఇన్నోవేటర్స్తో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇన్నోవేటర్స్ తమ ఇన్నోవేషన్ వివరాలను 91006 78543 నంబర్కు వాట్సప్ ద్వారా ఆగస్టు 5లోగా పంపించాలని నిర్వాహకులు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జిల్లా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసి ప్రదర్శిస్తారని వివరించారు. 33 జిల్లాల నుంచి ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలను అన్ని వర్గాల ప్రజలు పంపించవచ్చని, గ్రామీణ ఇన్నోవేటర్స్, స్కూల్స్, కాలేజీలు, స్టార్టప్లు, ఇండస్ట్రియల్ ఇన్నోవేటర్స్, అగ్రికల్చర్ ఇన్నోవేటర్స్& ఇలా అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం తదితరులు పాల్గొన్నారు.